
కల్వకుర్తి, వెలుగు: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూ సమస్యలకు భూభారతి పరిష్కారం చూపుతుందని నాగర్కర్నూల్ ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఊరుకొండ రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సాదాబైనామా లావాదేవీలకు పరిష్కారం చూపుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూ సర్వే నిర్వహించి, మ్యాప్ తయారు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు ఉండవని తెలిపారు.అడిషనల్ కలెక్టర్ అమరేందర్, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
మద్దూరు: రైతుల భూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని -నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మండలంలోని జాదవరావుపల్లి గ్రామంలో భూభారతి సదస్సుకు అడిషనల్ కలెక్టర్ బేన్ షాలోమ్ తో కలిసి హాజరయ్యారు. సదస్సుల్లో రైతుల నుంచి వినతులు తీసుకొని అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామానికి సంబంధించిన పహాని, పాత, కొత్త ఆర్వోఆర్,సేత్వార్ నకల్, తదితర భూ రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డీటీ వాసుదేవ రావు, సర్వేయర్ అశోక్, ఆర్ఐలు కమలాకర్, ప్రకాశ్ ఉన్నారు.
ధన్వాడ: భూభారతి రైతుల సమస్యల పరిష్కార వేదికగా ఉంటుందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. తహసీల్దార్ ఆఫీస్లో జరిగిన భూభారతి అవగాహన సదస్సుకు హాజరయ్యారు. భూభారతితో అన్ని భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. తహసీల్దార్ సింధూజ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఏవో నవీన్ పాల్గొన్నారు.
కేటిదొడ్డి: మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి రైతు వేదిక నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ హరికృష్ణ హాజరై చట్టంపై అవగాహన కల్పించారు. భూ సమస్యలపై దరఖాస్తు చేసుకొని వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు.
ఉప్పునుంతల: ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను భూభారతి చట్టంతో పరిష్కారం అవుతాయని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ తెలిపారు. ఉప్పునుంతల రైతువేదికలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ ప్రమీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెబ్బేరు/శ్రీరంగాపూర్: రైతులకు మేలు చేసేందుకు ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పాల్గొన్నారు. శ్రీరంగాపూర్ కు చెందిన సన్న బియ్యం లబ్ధిదారులు వెంకటయ్య, మంజుల దంపతుల ఇంటిలో సహపంక్తి భోజనం చేశారు. 18 లక్షల ఎకరాల భూమిని మాయం చేసిన ధరణితో రైతులు పడుతున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, తహసీల్దార్
లక్ష్మి పాల్గొన్నారు.