పప్పు నీళ్లు పోస్తే పిల్లలు ఎట్లా తింటారు : కలెక్టర్  విజయేందిర బోయి

పప్పు నీళ్లు పోస్తే పిల్లలు ఎట్లా తింటారు : కలెక్టర్  విజయేందిర బోయి
  • టీచర్లపై పాలమూరు కలెక్టర్​ ఆగ్రహం

గండీడ్, వెలుగు: పప్పు నీళ్లు పోస్తే విద్యార్థులు ఎలా తింటారని టీచర్లపై కలెక్టర్  విజయేందిర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని వెన్నచేడ్  హైస్కూల్, అంగన్​వాడీ సెంటర్లు, ప్రైమరీ స్కూల్, హెల్త్  సెంటర్ ను తనిఖీ చేశారు. హైస్కూల్​లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నీళ్ల పప్పు వడ్డించడం చూసి ఇది పప్పేనా? నీళ్లు పోస్తే పిల్లలు ఎలా తింటారంటూ టీచర్లు, వంట నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెల్త్  సెంటర్​లో రికార్డులు సరిగా లేకపోవడంతో రోజు వచ్చే రోగుల వివరాలు నమోదు చేయకపోవడమేమిటని సిబ్బందిపై మండిపడ్డారు. అంగన్​వాడీ సెంటర్​లో పౌష్టికాహారం, గుడ్లు, రికార్డులు పరిశీలించారు. సూపర్​వైజర్  అంగన్​వాడీ సెంటర్లను విజిట్  చేసినట్లు లేకపోవడంతో అంగన్​వాడీ టీచర్​ను ఈ విషయమై ప్రశ్నించారు. సెంటర్​ విజిట్ కు రావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో సూపర్​వైజర్ కు షోకాజ్​ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఎంపీవో నరేందర్ రెడ్డి, మాజీ  సర్పంచ్  పుల్లారెడ్డి పులిందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

డాక్టర్లు సమయపాలన పాటించాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్: జిల్లాలో పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్  విజయేందిరబోయి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై పీహెచ్ సీ, సబ్  సెంటర్ల మెడికల్  ఆఫీసర్లతో వెబ్  కాన్ఫరెన్స్  నిర్వహించారు. అన్ని రిజిస్టర్లను సక్రమంగా మెయింటెయిన్​ చేయాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. ఫీవర్ సర్వేను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెల 1న గ్రామ హెల్త్, శానిటేషన్, న్యూట్రిషన్  దినాన్ని తప్పకుండా నిర్వహించాలన్నారు. అడిషనల్  కలెక్టర్  శివేంద్రప్రతాప్, డీఎంహెచ్ వో పద్మ పాల్గొన్నారు.