
గూడూరు/ పలిమెల, వెలుగు: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్లు అద్వైత్ కుమార్, రాహుల్ శర్మ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్, మహాత్మ జ్యోతిరావు పూలే హస్టల్ను ఆ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి, వంటగది, స్టోర్ రూమ్, టాయ్ లెట్లు పరిశీలించారు. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూరు, తిమ్మేటి గూడెం గ్రామాల్లో ఆశ్రమ పాఠశాల, ఎంపీపీఎస్, అంగన్వాడీ సెంటర్, గ్రంథాలయాలను ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు.
విద్యార్థుల వివరాలు, వారికి అందిస్తున్న భోజన సదుపాయంపై ఆరా తీశారు. విద్యార్థులు, చిన్నారులతో సరదాగా మాట్లాడి వారి పరిజ్ఞానాన్ని పరీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సబ్జెక్టుల వారీగా టీచర్లు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని చెప్పారు. వారివెంట అధికారులు తదితరులున్నారు.