ACB Telangana: రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి ఫొటోకు ఫోజులు..!

ACB Telangana: రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి ఫొటోకు ఫోజులు..!

హైదరాబాద్: పంజాగుట్ట సర్కిల్-I, హైదరాబాద్‌ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి, తనకు ఇంతకు ముందు అందిన నోటీసును మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుంచి లంచం తీసుకుంటూ శ్రీధర్ రెడ్డి దొరికిపోయాడు. ఈ రైడ్స్కు సంబంధించిన వివరాలను రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడేళ్లకు గాను లెక్కింపు చేయించేందుకు పంజాగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ టాక్స్ ఆఫీసర్ శ్రీధర్కు దరఖాస్తు చేసుకున్నాడు.

Also Read :- 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

అయితే అతను సబ్మిట్ చేసిన ఫార్మాట్ కరెక్ట్గా లేదంటూ శ్రీకాంత్కు శ్రీధర్ షోకాజ్ నోటీసులు పంపించాడు. ఆ నోటీసుకు గానూ అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గానే అందజేశామని శ్రీకాంత్ అధికారికి బదులిచ్చాడు. అయినప్పటికీ లెక్కింపు చేయాలంటే తనకు మూడు లక్షలు లంచం ఇవ్వాలని స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని శ్రీకాంత్ తెలుపగా , రూ.2 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీకాంత్ ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. ఏసీబీ వలలో శ్రీధర్ చిక్కాడు. అబిడ్స్లోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా శ్రీధర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు.