ఎమ్మెల్సీకి పోటాపోటీ

ఎమ్మెల్సీకి పోటాపోటీ
  • కరీంనగర్​  గ్రాడ్యుయేట్స్ కి 68,  
  • టీచర్​ ఎమ్మెల్సీకి 16 నామినేషన్లు 
  • నల్గొండలో 23 మంది దాఖలు 
  • కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ అభ్యర్థి
  • మాజీ డీఎస్పీ గంగాధర్  
  • ఇయ్యాల్టీ వరకే నామినేషన్ 
  • విత్ డ్రా  గడువు ఉపసంహరణ చేయించేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థుల యత్నాలు

కరీంనగర్, వెలుగు : ఉమ్మడి మెదక్, కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ కు తీవ్ర పోటీ నెలకొంది. 2019లో 36 నామినేషన్లు దాఖలైతే17 మంది అభ్యర్థులు నిలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో వంద నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో32 మంది నామినేషన్లను వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. 68 నామినేషన్లు ఆమోదం పొందాయి. 

విత్ డ్రా చేసుకునేం దుకు రెండు రోజులు గడువు ఇవ్వగా బుధవారం ఒక్కరు కూడా చేసుకోలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంట ల్లోపు ఎంతమంది విత్ డ్రా చేసుకుంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది. నామినేషన్‌‌ వేసిన కొందరిని విత్‌‌ డ్రా చేయించి, తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కరీంనగర్​టీచర్స్ ​ఎమ్మెల్సీకి 16, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి 23 మంది బరిలో నిలిచారు. 

 కాంగ్రెస్ కు మాజీ డీఎస్పీ గంగాధర్ మద్దతు  

ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం. గంగాధర్.. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హన్మంత రావుతోపాటు సెక్రటేరియట్ కు వచ్చిన గంగాధర్ కు మంత్రి శ్రీధర్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అప్పుడు రంజిత్ .. ఇప్పుడు ప్రొ. చెన్న కృష్ణారెడ్డి 

బీజేపీకి రెబల్స్ ట్రబుల్స్‌‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ  టికెట్ ఆశించి భంగపడిన ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కామారెడ్డికి చెందిన రంజిత్ మోహన్.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి ఓట్లు చీల్చారు. దీంతో బీజేపీ అభ్యర్థి సుగుణాకర్ రావు మూడో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా గతంలో ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,  ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన చెన్న కృష్ణారెడ్డికి ఏబీవీపీ, బీజేపీ శ్రేణులతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆయన చీల్చే ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మైనస్ గా మారే చాన్స్ ఉంది. అందుకే ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు పార్టీ పెద్దలు మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది.