
- విలువైన సర్టిఫికెట్లు, గోల్డ్ పోగొట్టుకున్నా చలానా కట్టాల్సిందే..
- చోరీ అయితేనే స్టేషన్ లో నేరుగా ఫిర్యాదు స్వీకరణ
- ప్రాసెస్ సింపుల్ చేసేందుకే అంటున్న పోలీస్ ఆఫీసర్లు
- ఇదో రకం దోపిడీ అంటున్న పబ్లిక్
మార్కెటింగ్ జాబ్ చేసే పి.సురేశ్ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాడు. థియేటర్ లో రూ.50వేల విలువైన సెల్ ఫోన్ పొగొట్టుకున్నాడు. సినిమా ముగిశాక బయటికి వచ్చి చూస్తే, జేబులో సెల్ ఫోన్ కనిపించలేదు. హాల్లో వెతికితే దొరకలేదు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి విషయం చెబితే మీసేవాలో చలానా కట్టి తెస్తేనే కంప్లయింట్తీసుకుంటామన్నారు. సండే కావడంతో మీ సేవా తీసిలేదు. సోమవారం పోలీసులు చెప్పిన ప్రకారం మీసేవాకు వెళ్తే రూ.150 తీసుకుని సెల్ ఫోన్ పోయినట్టు ఆన్ లైన్ లో కంప్లయింట్ రిజిస్టర్ చేసి ఒక రిసిప్ట్ చేతిలో పెట్టారు.
ఖమ్మం, వెలుగు: మీరు ఖరీదైన సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా? విలువైన మీ సర్టిఫికెట్లు కనిపించడం లేదా ? జర్నీలో బంగారాన్ని మిస్ చేసుకున్నారా? అయితే వెంటనే మీరు సమీపంలోని మీ సేవా సెంటర్ కు వెళ్లాలి. అదేంటి, ఏదైనా పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్ కి కదా పోవాల్సింది అని అనుమానపు ఫేస్ పెట్టాల్సిన పనిలేదు. కొద్దిరోజులుగా ఇలాంటి కంప్లయింట్స్ను పోలీస్ స్టేషన్ లో కాకుండా, మీ సేవాలోనే
తీసుకుంటున్నారు.
రూ.145 చలానా కట్టాలి..
సినిమాహాళ్లలో, మాల్స్లో, ఇతర పబ్లిక్ ప్లేస్లలో, జర్నీలో సెల్ఫోన్, బ్యాగ్, పర్స్, డాక్యుమెంట్లు, నగలు పోగొట్టుకున్న వాళ్లు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్తే కంప్లయింట్తీసుకోవడం లేదు. బాధితులకు మీ సేవాలో కంప్లయింట్చేయాలని సూచిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే రూ.145 చలానా కట్టాలనేసరికి జనం బిత్తరపోతున్నారు. గతంలో ఇలాంటి కంప్లయింట్లను పోలీస్స్టేషన్లో ఫ్రీగా తీసుకొని ఎంక్వైరీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్అమల్లోకి తెచ్చారు. అసలే వస్తువు పోగొట్టుకున్న బాధలో ఉన్న వాళ్లను మీ సేవాల చుట్టూ తిప్పించడం,రూ.145 ఖర్చు పెట్టించడం ఎంత వరకు సమంజసమని బాధితులు అంటున్నారు.
రెండు రకాల కంప్లయింట్స్
వస్తువులు పోగొట్టుకున్నప్పుడు కంప్లయింట్విషయంలో పోలీసులు రెండు విధానాలను అమలు చేస్తున్నారు. సెల్ ఫోన్ అయినా, సర్టిఫికెట్లు లేదా బంగారం.. ఇలా ఏ వస్తువు అయినా చోరీకి గురైతే స్టేషన్ కు వచ్చి కంప్లయింట్చేయవచ్చని సూచిస్తున్నారు. ఎక్కడైనా దొంగతనం జరిగిందని అనిపిస్తేనే డైరెక్ట్ కంప్లయింట్ తీసుకుంటామని అంటున్నారు. ఓనర్ నిర్లక్ష్యం కారణంగా వస్తువును పోగొట్టుకుంటే మాత్రం మీసేవా లేదంటే ఈసేవాలో కంప్లయింట్రిజిస్టర్ చేయొచ్చని చెబుతున్నారు దీని ద్వారా బాధితులకు త్వరగా కంప్లయింట్ ఇచ్చే చాన్స్తో పాటు కేసును ఎప్పటికప్పుడు ఫాలోఅప్చేసే చాన్స్ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కానీ బాధితుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫ్రీగా కంప్లయింట్ఇచ్చే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆన్లైన్ రూపంలో కొత్త దోపిడీకి తెరలేపారని అంటున్నారు. పోలీసులు చెప్పే కారణం కరెక్ట్గా లేదని, మున్ముందు అన్ని రకాల కంప్లయింట్లకు పేమెంట్వసూలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ చలానా కట్టాక పోగొట్టుకున్న వస్తువుకు సంబంధించి ఏడు రోజుల్లో సమాచారం ఇస్తామని పోలీసులు చెబుతున్నా, ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు. దొరికినప్పుడు ఇస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని, అలాంటప్పుడు కంప్లయింట్కు చలానా కట్టించుకోవడం ఎంతవరకు కరెక్ట్అని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.