
జగదేవపూర్(వెలుగు) : దళితులకు షాపుల్లో క్షవరం చేయట్లేదని, చెట్ల కింద అయితేనే చేస్తున్నారని సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ లోని దళితులు తహసీల్దార్కు బుధవారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. కొంతమంది యువకులు హెయిర్ కట్టింగ్ కోసం బుధవారం గ్రామంలోని సెలూన్కు వెళ్లారు. ఓ వ్యక్తి కూర్చీలో కూర్చోగా షాపు నిర్వాహకుడు ‘మీకు షాప్లో క్షవరం చేయం. మీ వాడలోని చెట్టు కిందనే కట్టింగ్ చేస్తాం’ అని అతడిని బయటికి పంపించాడు.
దళితులమైనందునే తమకు షాప్లో క్షవరం చేయడం లేదని గ్రామానికి చెందిన 30 మంది దళిత యువకులు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మరాఠీ కృష్ణ మూర్తితో కలిసి జగదేవ్ పూర్ తహసీల్దార్ రఘువీరా రెడ్డికి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మూర్తి మాట్లాడుతూ క్షవరం విషయంలో దళితుల పట్ల వివక్ష చూపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.