
నిజాంపేట, వెలుగు: మేము ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తామా.. డబుల్ బెడ్ రూమ్ స్కీంకి పనికిరామా' అని నందిగామ మహిళలు ప్రశ్నించారు. గ్రామంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని ఆందోళన చేపట్టారు. ఆదివారం నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు, తహసీల్దార్ సురేశ్ కుమార్, సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్లు కలిసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. కాగా గ్రామ సభ నిర్వహించకుండా డబుల్ ఇళ్ల ను ఎలా కేటాయిస్తారని గ్రామస్తులు మండిపడ్డారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు సీక్రెట్ మెయింటెన్ చేశారని ఆరోపించారు. అర్హులైన వారి పేర్లు చదివి వినిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయగా తహసీల్దార్30 మంది పేర్లను చదివి వినిపించారు. ఇందులో అనర్హులైన ఇద్దరి ఇళ్ల పట్టాలను పక్కన పెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రాజశేఖర్, జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ స్కీమ్ నిజమైన లబ్ధిదారులకు అందడం లేదన్నారు.