
- సమీకరించడంలో విఫలమైన వ్యవసాయ అధికారులు
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా ఎలా ఉండాలన్న అంశంపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు రైతులను సమీకరించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని రైతు వేదికల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరగాల్సి ఉంది.
కానీ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగింది. దీనికి జిల్లాలో రైతుల నుంచి స్పందన కరువైంది. చెన్నూర్ మండలం కిష్టంపేట రైతు వేదికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులు పెద్దగా కనిపించలేదు. వచ్చినవారు కూడా సంతకాలు చేసి వెళ్లిపోయారు. కొంతమంది ఏఈవోలు సైతం ఈ ప్రోగ్రాంకు డుమ్మా కొట్టారు. లక్సెట్టిపేటలో 20 మంది రైతులు మాత్రమే హాజరుకాగా, కన్నెపల్లి, బెల్లంపల్లిలో 50 మందిలోపే వచ్చారు.
పదెకరాలు సాగు చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలి: రైతు పులిశెట్టి సత్తయ్య
పదెకరాల భూమి సాగు చేసే రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామానికి చెందిన పులిశెట్టి సత్తయ్య కోరారు. కన్నాల రైతు వేదికలో నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రైతులకు మంత్రితో మాట్లాడే చాన్స్ రాకపోగా చివరగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ తాండూర్ మండలం ద్వారకాపూర్కు చెందిన సత్తయ్యకు మాట్లాడే అవకాశం కల్పించారు. పాడుబడ్డ, సాగు యోగ్యం కాని, సాగు చేయని భూములకు రైతుబంధు ఇవ్వకూడదని ఆయన కోరారు. స్పందించిన డైరెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.