ఓసీపీ ఓబీ కాంట్రాక్టర్​ జీతాలు ఇస్తలేడు .. కాంట్రాక్ట్​డ్రైవర్లు, హెల్పర్లు ఆవేదన

ఓసీపీ ఓబీ కాంట్రాక్టర్​ జీతాలు ఇస్తలేడు .. కాంట్రాక్ట్​డ్రైవర్లు, హెల్పర్లు ఆవేదన
  • ...కాంట్రాక్టర్, సింగరేణి పట్టించుకుంటలేదు
  • 20 రోజులుగా విధులు లేక ఇబ్బందుల్లో ఉన్నాం

కోల్​బెల్ట్, వెలుగు:​ మందమర్రి ఏరియా సింగరేణి కేకే ఓసీపీలో పనులు లేక 20 రోజులుగా అవస్థలు పడుతున్నామని కాంట్రాక్ట్​డ్రైవర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మందమర్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేకే ఓసీపీలోని ఆర్​వీఆర్​ ఓబీ కాంట్రాక్టర్ ​వద్ద కాంట్రాక్ట్​డ్రైవర్లు, హెల్పర్లుగా 480 మంది పనిచేశామని ఆగస్టు, సెప్టెంబర్​ నెలల జీతాలు ఇంకా ఇవ్వలేదని, అక్టోబర్​లో దసరా పండుగ బోనస్ చెల్లించలేదని వాపోయారు.

సెప్టెంబర్​30తో ఓబీ కాంట్రాక్ట్​ పూర్తయిందని, తమ వేతనాలు, బోనస్​ సెటిల్​మెంట్ చేస్తానని కాంట్రాక్టర్ ​హామీ ఇచ్చి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మరో ఏడాది కాంట్రాక్ట్ ​దక్కించుకున్నప్పటికీ సదరు ఆర్​వీఆర్ ​కంపెనీ పనులు చేయకపోవడంతో తాము 20 రోజులుగా డ్యూటీలు లేక ఖాళీగా ఉంటున్నామని అన్నారు. తమ డ్రైవింగ్​లైసెన్సులు కాంట్రాక్టర్​ వద్ద ఉండటంతో ఇతర చోట్ల పనికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం దృష్టికి తీసుకవెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు తమకు అండగా నిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో కాంట్రాక్ట్​ డ్రైవర్లు  ఎండి నజరుద్దీన్, ఏ సతీష్ , రాగిడి రామ్ రెడ్డి, రమేష్, రాజేందర్, శ్రీధర్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.