
యూఎన్ఎఫ్ సీసీసీ సభ్య దేశాల 27వ సమావేశం (కాప్–27) నవంబర్ 6 నుంచి 18 వరకు ఈజిప్టులోని షర్మ్ – ఎల్– షేక్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల దృష్ట్యా యూఎన్ఎఫ్సీసీసీ, కాప్ సదస్సులు చాలా కీలకం. కాప్ ఏర్పాటు, దాని ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం.
మానవ అభివృద్ధి చర్యల ద్వారా పర్యావరణంపై ఏర్పడుతున్న ప్రభావాలను నియంత్రించాలన్న లక్ష్యంతో తొలిసారిగా 1972లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ పేరుతో స్టాక్హోంలో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ కోసం సభ్యదేశాలన్నీ శాసనాలు, చట్టాల ద్వారా కృషి చేయాలని తీర్మానించారు. భూతాపం ద్వారా సంభవిస్తున్న శీతోష్ణస్థితి మార్పుపై అధ్యయనంపై 1988లో యూఎన్ఈపీ అండ్ డబ్ల్యూఎంఓ సంయుక్తంగా ఇంటర్ గవర్నమెంటల్ పానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(ఐపీసీసీ) అనే ఒక సంస్థను నియమించింది. ఈ సంస్థ మొదటి నివేదిక 1990లో విడుదలైంది. ఇందులో మానవ జనిత కారణాల ద్వారానే ప్రస్తుత భూతాపం, శీతోష్ణస్థితి మార్పు సంభవిస్తున్నాయని ఐపీసీసీ పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో భూతాపాన్ని, శీతోష్ణస్థితి మార్పును నివారించే ఒక ఒప్పందం అవసరమని యూఎన్ఓ గుర్తించి అందుకు అనుగుణంగా పర్యావరణంపై మానవ అభివృద్ధి ప్రభావాలను చర్చించేందుకు 1992 జూన్ 3 నుంచి 14 మధ్యలో బ్రెజిల్లోని రియో డి జెనైరోలో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సదస్సును యూఎన్ఓ నిర్వహించింది. దీన్నే రియో సదస్సు లేదా ధరిత్రి సదస్సు అంటారు. ఈ సదస్సులో ప్రవేశ పెట్టిన ఒప్పందాల్లో యూఎన్ఎఫ్సీసీ(యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) ప్రధానమైంది. సభ్యదేశాలన్నీ మనిషి, ఇతర జీవులపై ప్రభావాన్ని చూపని స్థాయికి గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదలను తగ్గించాలని పేర్కొన్నారు. యూఎన్ఎఫ్సీసీసీపై సంతకాలు చేసిన దేశాలన్నీ 1995 నుంచి ప్రతి ఏటా సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) అంటారు. మొదటి సదస్సు కాప్–1 బెర్లిన్ (1995)లో జరిగింది. 1997లో క్యోటో నగరంలో జరిగిన కాప్–3 సదస్సులో క్యోటో ప్రోటోకాల్ అనే ఒప్పందాన్ని రూపొందించారు.
కాప్–26
యూఎన్ఎఫ్సీసీసీ సభ్యదేశాల 26వ సమావేశం కాప్–26 స్కాట్ల్యాండ్లోని గ్లాస్గో నగరంలో 2021 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 మధ్యకాలంలో జరిగింది. ఈ సదస్సును ఇటలీ, యూకే సంయుక్తంగా నిర్వహించాయి. ఇందులో తీసుకున్న నిర్ణయాలకు గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్(జీసీపీ) అని పేరు పెట్టారు.
జీపీసీ ముఖ్యాంశాలు
- పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2100 నాటికి ఉష్ణోగ్రతల పెరుగదలను 2 డిగ్రీల లోపే పరిమితం చేయాలి. వీలైతే 1.5 డిగ్రీలకే పరిమితం చేయాలి.
- 2050 నాటికి నెట్జీరో ఉద్గారాలను సాధించాలంటే రెండు దశాబ్దాల్లో 45శాతం మేరకు ఉద్గారాలను తగ్గించాలి. 2025 వరకు వేచి చూడకుండా 2022లోనే మరింత బలమైన జాతీయ ప్రణాళికలు, కొత్త లక్ష్యాలను సభ్య దేశాలు ప్రకటించాలి.