
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్ లో చాలా ఎర్రర్స్ ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) ఆటలాడుకుంటున్నదని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. ఎన్టీఏ విడుదల చేసిన రెస్పాన్స్ షీట్.. తాము అటెంప్ట్ చేసిన ప్రశ్నల సంఖ్యకు సరిపోవడంలేదని స్టూడెంట్లు చెప్తున్నారు.
అలాగే, చాలావరకు తప్పుడు సమాధానాలు చూపిస్తున్నదని అంటున్నారు. తాము రాసిన ప్రశ్నలకు.. రెస్పాన్స్ షీట్కు అసలు పొంతనే లేదంటున్నారు. కాగా, జేఈఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్ ఈ నెల 2, 3, 4, 7, 9వ తేదీల్లో నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఏ నిర్లక్ష్యంపై అటు స్టూడెంట్లు, ఇటు పేరెంట్స్ మండిపడుతున్నారు.
ఎన్టీఏకు మెయిల్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిపారు. ఎగ్జామ్లో రాసిన ప్రశ్నలు ఏవీ కూడా.. రెస్పాన్స్ షీట్లో లేవని స్టూడెంట్లు చెప్తున్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఎన్టీఏ అధికారులు స్పందించలేదు.