
- ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారుల్లో సందిగ్ధత
- క్లారిటీ కోసం పౌరసరఫరాల కమిషనర్కు సీఆర్వో లెటర్
హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం హైదరాబాద్ జిల్లాలో ఆలస్యంగా అమలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అన్నిరేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది సందర్భంగా హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే, హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఏప్రిల్25 వరకూ సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
షాపులకు చేరుకున్న దొడ్డు బియ్యం
సన్న బియ్యం పంపిణీ చేయాలంటూ తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సీఆర్ఓ ఫణీంద్ర రెడ్డి తెలిపారు. ఇప్పటికే అన్ని రేషన్షాపులకు దొడ్డు బియ్యం చేరుకుందన్నారు. అయితే, ఈ విషయంలో క్లారిటీ కోసం పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు లెటర్రాసినట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అయితే, ఆదివారం వరకూ రిప్లై రాకపోవడం, ఇప్పటికే రేషన్షాపులకు దొడ్డు బియ్యం చేరుకోవడంతో ఈ నెల పంపిణీ ఉండకపోవచ్చని తెలుస్తున్నది.
ఆరు లక్షలకుపైగానే కార్డులు
హైదరాబాద్నగరంలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, 653 రేషన్షాపులున్నాయి. మొత్తం 6,39,451 రేషన్కార్డులు ఉండగా, అన్నపూర్ణ ఫుడ్సేఫ్టీ కార్డులు(ఏఎఫ్ఎస్సి) 29,684, ఫుడ్ సేఫ్టీ లబ్ధిదారులు(ఎఫ్ఎస్) 6,08,577 మంది, అన్నపూర్ణ అంత్యోదయ పథకం (ఏఏపి) కింద 1,290 మంది లబ్ధిదారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి తలా ఆరు కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు.