
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం పదే పదే ద్రోహం చేస్తుండడంతోనే రైతులు న్యాయం కోసం వేడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రైతుల గొంతెత్తే హక్కును ప్రభుత్వం హరించొద్దని ఆయన సూచించారు. రైతులు న్యాయం కోసం పదే పదే ఢిల్లీ గడప తొక్కాలా? అని ప్రధాని మోదీని ఖర్గే సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘‘మీరు హర్యానా, రాజస్థాన్లలో పర్యటించినప్పుడు.. దేశానికి అన్నం పెట్టే రైతు పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.
మీ ప్రభుత్వం పదే పదే ద్రోహం చేసిందని రైతులు న్యాయం కోసం వేడుకుంటున్నారు" అని ఖర్గే ఒక పోస్ట్లో పేర్కొన్నారు. ‘‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోవడం, స్వామినాథన్ నివేదిక ప్రకారం ఇన్పుట్ కాస్ట్ ప్లస్ 50% ఎంఎస్పీని అమలు చేయకపోడం, ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినా.. దానిపై చర్య తీసుకోకపోవడం మీరు చేసిన ద్రోహాలు’’ అని మోదీ ప్రభుత్వంపై ఖర్గే మండిపడ్డారు.