
- రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ
- బీఆర్ఎస్ హయాంలో రాళ్లు, గుట్టలున్న భూములకు రూ.24 వేల కోట్ల రైతు బంధు ఇచ్చిన్రు
- ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నిజామాబాద్, వెలుగు : పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలబడడమే కాంగ్రెస్ లక్ష్యమని ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల్లో ఆ పార్టీ లీడర్లకే పెద్దపీట వేసి, పేదలను విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. తమకు ప్రజల సంక్షేమమే ముఖ్యం కానీ రాజకీయాలు కాదన్నారు.
ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. టెక్నికల్ ఇష్యూల కారణంగా అర్హులు నష్టపోకుండా చూడాలన్నారు. ఇప్పటివరకు అమలవుతున్న ఏ పథకాన్ని కూడా ఎత్తివేయబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ, ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రేషన్కార్డులు, ఇండ్ల మంజూరు నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల భారాన్ని భరిస్తూనే, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. గుట్టలు, రాళ్లు రప్పలున్న భూములకు బీఆర్ఎస్ పాలకులు రైతుబంధు కింద రూ.24 వేల కోట్ల ప్రజాధనం ఇచ్చారని విమర్శించారు. రానున్న నాలుగేండ్లలో సంక్షేమ పథకాలను విస్తృతస్థాయిలో అమలుచేసేలా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
మీటింగ్లో గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీల్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, లక్ష్మీకాంతరావు, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం సిటీ కమిషనరేట్ పరిధిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.