
మెదక్, వెలుగు: హరీశ్రావును చూస్తే అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మెదక్ నవాపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దొంతి లక్ష్మి, మాజీ కౌన్సిలర్ ముత్యంగౌడ్ దంపతులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు.
మంత్రి హరీశ్ రావు పొద్దున లేచిన నుంచి అన్నీ అబద్ధాలే మాట్లాడుతారని ధ్వజమెత్తారు. మెదక్ లో ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరో అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు నాగార్జున సాగర్, సింగూర్ ప్రాజెక్ట్ కట్టారని, వాటికి ఇప్పటి వరకు కనీసం పగుళ్లు కూడా రాలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజి ఏడాది లోపే కుంగిపోయిందన్నారు.
ALSO READ: బీసీ లీడరే ముఖ్యమంత్రి : రఘునందన్ రావు
అలాగే కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కుక్కతోక తాకినా కూలిపోయేటట్టున్నాయని ఆరోపించారు. మెదక్ నియోజకవర్గంలో పేదలెవరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదు కానీ, కేసీఆర్ మాత్రం తొమ్మిదెకరాల్లో బంగ్లా కట్టుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు సురేందర్ గౌడ్, జీవన్ రావు, ప్రశాంత్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, బొజ్జ పవన్, ఉప్పల రాజేశ్, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.