
సెక్రటేరియట్ : ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరుపై సీఈఓ రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరిపై దుష్ప్రచారం జరిగిందనీ.. ఎవరు తప్పుడు ప్రచారం చేశారో వారి వివరాలు ఇస్తే కూడా పట్టించుకోలేదని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఖమ్మంలో కాలేజీ పిల్లలతో దొంగ ఓట్లు వేయించారునీ… స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ చుట్టాలు… వాళ్ళ విద్యార్థులను తీసుకువచ్చి ఓట్లు వేయించినా ఎవరూ పట్టించుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. “అధికార పార్టీలపై ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదు. విగ్రహాలకు ముసుగు కప్పి అవమాన పరిచారు. ఒక అభ్యర్థిపై రైడ్ చేసి… ఏమీ దొరకనప్పుడు కనీసం సారీ కూడా చెప్పలేదు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై మాత్రమే ఎందుకు దాడులు చేస్తున్నారు? అసలు ప్రజాస్వామ్యం ఉందా? అధికార పార్టీ వారి ఆగడాలు హద్దులు మీరాయి. అధికారంతో మా అనుమతి లేకుండా మా గదుల్లో సోదాలు చేస్తారు…. మేము లేనప్పుడు మా కార్యాలయంలో ఏదైనా పెట్టి సోదాలు చేస్తే ఎవరు బాధ్యులు? మా కార్యాలయలపై సోదాలు చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి. ” అని రేణుకాచౌదరి చెప్పారు.