
- సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ పాదయాత్ర
సిద్దిపేట రూరల్, వెలుగు : ఎమ్మెల్యేగా ఎన్నికై లక్షల రూపాయల ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఫామ్హౌస్కే పరిమితం అయిన కేసీఆర్ వెంటనే ప్రజల్లోకి రావాలని, లేకపోతే రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షారెడ్డి నేతృత్వంలో సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్రను గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి నర్సారెడ్డి హాజరై మాట్లాడారు. కేసీఆర్ను మూడుసార్లు గెలిపించిన గజ్వేల్ ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రజల మధ్యకు రాకున్నా, సమస్యలు పట్టించుకోకున్నా, అసెంబ్లీకి వెళ్లకున్నా.. లక్షల రూపాయల జీతం మాత్రం తీసుకుంటున్నారని, ప్రజల కోసం పనిచేయకుండా ప్రజా ధనాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
ఇప్పటికి రూ.59 లక్షల రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ కనీసం 59 నిమిషాలు కూడా గజ్వేల్ ప్రజల కోసం గానీ, అసెంబ్లీలో మాట్లాడడం కోసం గానీ కేటాయించకపోవడం దారుణమన్నారు. శాసనసభ్యత్వం రద్దు అవుతుందన్న భయంతోనే రెండు సార్లు అసెంబ్లీకి వెళ్లాడని విమర్శించారు. ఐదు రోజుల పాటు సాగే పాదయాత్ర రాజ్భవన్ వద్ద ముగుస్తుందని, అక్కడ గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. మడుపు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, అనంతుల నరేందర్ తదితరులు ఉన్నారు.