దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ .. ఇయ్యాల సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్ ​ఓపెనింగ్​

దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ .. ఇయ్యాల సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్ ​ఓపెనింగ్​
  • కాంగ్రెస్​ప్రభుత్వం పక్కా ప్లానింగ్​తో ప్రాజెక్ట్​ పూర్తిపై దృష్టి 
  • 3.23లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా పనులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నేడు సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ ఓపెనింగ్​తో ఉమ్మడి ఖమ్మం జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. దాదాపు ఎనిమిదేండ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గోదావరి జలాలు సీతారామ ద్వారా ఉమ్మడి జిల్లాలో నేడు పారనున్నాయి. పక్కా ప్రణాళికతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​, జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి కొమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఇరిగేషన్​మినిస్టర్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి సాయంతో అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి పనులు చకచక చేయించారు.  ఫలితంగా గురువారం సీఎం రేవంత్​ రెడ్డి సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 
ప్రారంభించనున్నారు. 

పక్కా ప్లాన్​తో.. 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​  గవర్నమెంట్​ సీతారామ ప్రాజెక్ట్​పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాజెక్ట్​ నిర్మాణంలో జాప్యం, లోటు పాట్లపై ఇరిగేషన్​ ఆఫీసర్లతో జిల్లా మంత్రులు చర్చించారు. తక్కువ ఖర్చుతో సీతారామ ద్వారా నీళ్లిచ్చే ప్రక్రియపై కసరత్తు చేశారు. అశ్వాపురం మండలంలోని జీ కొత్తూరు, ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం పంప్​ హౌస్​ల్లో దాదాపు మూడున్నరేండ్లుగా పడావు పడి ఉన్న మోటార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్​ చేశారు. కేవలం రూ. 90కోట్లు ఖర్చు పెట్టి ఏన్కూర్​ నుంచి ఎన్​ఎస్​పీ కెనాల్​కు కేవలం ఎనిమిది కిలోమీటర్లు తవ్వి లింక్​ చేయడం వల్ల ఎన్ఎస్పీ ఆయకట్టు కింద 1.20లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చనే  నిర్థారణకు వచ్చారు. 

అవసరమైన ఫండ్స్​ కోసం ఇరిగేషన్​ మినిస్టర్, మంత్రులు సీఎంతో చర్చించారు.  సీంఎ అంగీకరించడంతో మోటార్లను ట్రయల్​రన్​ చేసేందుకు చైనా నుంచి ఇంజినీర్లను రప్పించారు. జీ కొత్తూరులోని మొదటి పంప్​ హౌస్​లో ట్రయల్​ రన్​ విజయవంతం అయ్యింది. అదే స్ఫూర్తితో 4 రోజుల కింద పూసుగూడెంలోని రెండో పంప్​ హౌస్,  బుధవారం కమలాపురంలోని మూడో పంప్​ హౌస్​ ట్రయల్​ రన్​  సక్సెస్​ చేశారు. 

ఫైనల్​గా  సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. కాగా ఇండిపెండెన్స్​ డే సందర్భంగా గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెంలోని రెండో పంప్​ హౌస్​లో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డితో కలిసి సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదే టైంలో బీజీ కొత్తూరులో కొమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కమలాపురంలలోని పంప్​ హౌస్​ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్​ ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

3.23 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

సాగర్​ నుంచి నీళ్లు రాకపోయినా సీతారామతో గోదావరి నీళ్లను పారించే విధంగా కాంగ్రెస్​ ప్రభుత్వం ప్లాన్ చేసింది. వచ్చే రెండేండ్లలో పాలేరు, సత్తుపల్లి ట్రంక్​ కేనాల్​ పనులు పూర్తి చేయడం, డిస్ట్రిబ్యూషన్​ కెనాల్స్​కు అవసరమైన భూ సేకరణ, ఇతరత్రా పనులకు దశల వారీగా టెండర్లను పిలవాలని ఇప్పటికే సీఎం మంత్రులతో పాటు ఇరిగేషన్​ ఆఫీసర్లను ఆదేశించారు. 

2026 ఆగస్టు 15 నాటికి సీతారామను పూర్తి స్థాయిలో కంప్లీట్​ చేసి భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​ జిల్లాల్లో 6.75లక్షల ఎకరాల నుంచి 7.81లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించారు. సీతారామ పూర్తి అయితే 3.23లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగు నీళ్లు అందుతాయని  స్పష్టం చేశారు.