
- పొద్దున పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ
- ప్రసంగించనున్న సోనియా, సీఎం
- అక్కడే రాష్ట్ర గీతం విడుదల
- సాయంత్రం ట్యాంక్బండ్పై సంబురాలు.. 700 మందితో కళారూపాల కార్నివాల్
- 5 వేల మందితో ఫ్లాగ్ వాక్.. అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వెర్షన్ ప్లే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు నిర్వహిస్తారు. జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. అక్కడే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఉంటుంది. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు.
అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మొదలవుతాయి. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్కు సీఎం రేవంత్రెడ్డి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.
ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఇటు చివర నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు ‘జయ జయహే తెలంగాణ’ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని ప్లే చేస్తారు. అదే వేదికపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులతో వేడుకలను ముగిస్తారు.