
- జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశం
- వాకౌట్ చేసి కాంగ్రెస్ జడ్పీటీసీ
సిద్దిపేట, వెలుగు: పోరాడి తెచ్చుకున్న తెలంగాణాలో అమరుల ఆకాంక్షలు నెరవేరడం లేదని కాంగ్రెస్ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల దినోత్సవం సందర్భంగా సమావేశంలో అమరులకు నివాళులర్పించి, మౌనం పాటించారు. ఈ సందర్భంగా కొండల్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల్లో జిల్లాలో ఒక్క చెక్ డ్యామ్ ను రిపేర్ చేయలేదన్నారు. జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ జోక్యం చేసుకుని రాజకీయ ప్రసంగాలు వద్దనడంతో రభస మొదలైంది. కొండల్ రెడ్డిని బీఆర్ఎస్ జడ్పీటీసీలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనను నిరసిస్తూ ఆయన వాకౌట్ చేశారు. అంతకు ముందు రోజాశర్మ మాట్లాడుతూ అమరుల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, లైబ్రరీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సగం మంది జడ్పీటీసీలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు.
అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
సంగారెడ్డి టౌన్, వెలుగు: అమరుల త్యాగాలు వెలకట్టలేని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి అన్నారు. గురువారం మంజుశ్రీ అధ్యక్షతన జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి , చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, వీరారెడ్డి, ఎమ్మెల్యే మాణిక్యరావు, లైబ్రరీ చైర్మన్ శివకుమార్, సీఈవోఎల్లయ్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.