
- అమృత్ 2.0 లో భాగంగా రూ.41.50 కోట్ల నిధుల మంజూరు
కోరుట్ల,వెలుగు: కోరుట్ల లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని, ఎస్సారెస్పీ ద్వారా తాళ్లచెరువు నింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గం ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. బుధవారం కోరుట్ల పట్టణ విలీన గ్రామం ఎఖీన్ పూర్ శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పైపులైన్ ద్వారా తాళ్ల చెరువులోకి నీరు నింపడం కోసం ఆర్డీవో జీవాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ఇరిగేషన్ అధికారులతో కలిసి జువ్వాడి నర్సింగరావు సందర్శించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. అమృత్ 2.0 లో భాగంగా కోరుట్ల ప్రజల దాహార్తి తీర్చడానికి మున్సిపాల్టీకి రూ.41.50 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ప్రభుత్వం ద్వారా అందజేసేలా కృషి చేస్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కోరుట్ల లోని 33 వార్డులకు కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక నిధుల ద్వారా 33 బోర్లు మంజూరు చేయించామన్నారు. తాళ్లచెరువు, కంచెరకుంట, మద్దుల చెరువు లో త్వరలోనే పూడిక తీయడం జరుగుతుందన్నారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ , మున్సిపల్ డీఈఈ సురేష్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ టౌన్, మండల , బ్లాక్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం, పెరుమాండ్ల సత్యనారాయణ, నయీమ్, అన్నం అనిల్, శీలం వేణుగోపాల్, మచ్చ కవిత పాల్గొన్నారు.