
వైరా, వెలుగు : బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర రాజకీయాలు పట్టించుకోబోమని, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారై, అప్పుల పాలయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా వైరాలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం తుమ్మల పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కూడా పూర్తికాకముందే రూ.42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీని గురువారం అమలు చేస్తున్నామని తెలిపారు.
ఐదేండ్ల ముందు రైతుల రుణాలను మాఫీ చేయలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మార్క్ఫెడ్రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.