నెట్వర్క్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. పలు చోట్ల బీజేపీ, పీఎం నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మొదటి నుంచి కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ఈ బడ్జెట్ ద్వారా మరోసారి రుజువు చేసిందన్నారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని బిహార్, ఢిల్లీ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించిందన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే తగినంత బడ్జెట్ ను కెటాయించి తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ఉట్నూర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని డిమాండ్ చేశారు.