మంచిర్యాలలో వేడుకలా ఎంపీ వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ

మంచిర్యాలలో వేడుకలా ఎంపీ వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ

కోల్​బెల్ట్, వెలుగు: పార్లమెంట్​లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారి మంచిర్యాల జిల్లాకు చేరుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్​శ్రేణులు, కాకా అభిమానులు ఘనస్వాగతం పలికారు. శనివారం సాయంత్రం జైపూర్​మండలం ఇందారం చేరుకున్న ఆయనను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానాలు ఘనంగా స్వాగతించారు. పూలమాలలు, శాలువాలు కప్పి ఆహ్వానించారు. డీజే సౌండ్స్, కళాకారుల డ్యాన్సుల మధ్య ఇందారం, నస్పూర్​- ఆర్కే6 మైన్​ఏరియా, రామకృష్ణాపూర్​ఏరియా ఆస్పత్రి, రాజీవ్​చౌక్​, సూపర్​బజార్​ మీదుగా ఆర్కే1 మార్కెట్​వరకు ర్యాలీ సాగింది.

ఇక్కడ ముస్లిం సంప్రదాయబద్దంగా ఎంపీ చేతికి దట్టి కట్టారు. కాళీనగర్​వద్ద మందమర్రి లీడర్లు, కార్యకర్తలు స్వాగతం పలికారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ర్యాలీ మందమర్రి మార్కెట్, పాలచెట్టు, పాతబస్టాండు మీదుగా తిరిగి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్​ఆర్​గార్డెన్స్​కు చేరింది. పాత బస్టాండ్​ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్​బాబు ర్యాలీలో పాల్గొన్నారు. మందమర్రి మార్కెట్​వద్ద డాక్టర్ బీఆర్​అంబేద్కర్​విగ్రహానికి ఎంపీ వంశీకృష్ణ పూలమాల వేసి నివాళి అర్పించారు.