
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సుధీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ హై కమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసింది. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అసెంబ్లీలో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. అయితే.. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలపడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు ఎమ్మెల్సీ సీటు కేటాయించింది కాంగ్రెస్. 2025, మార్చి 10తో నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగియనుండగా.. ఒక్క రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో సోమవారం (మార్చి 10) కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, 2025 మార్చి 29తో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ ఐదు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 1 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం దక్కనుంది. ఒక్క ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ టికెట్ మాజీ ఎంపీ విజయశాంతికి దక్కడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి ఎమ్మెల్సీ రేసులో రాములమ్మ పేరు లేదు.
చివర్లో అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. విజయ శాంతి నేరుగా ఢిల్లీలోనే పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ టికెట్ సాధించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ హైకమాండ్ ప్రియారిటీ ఇచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ వదులుకోగా.. విజయ శాంతి మెదక్ ఎంపీ టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే వీరి త్యాగాలను గుర్తించిన అధిష్టానం.. ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది.