- ఆయనవి పిట్టల దొర మాటలు: ఎంపీ మల్లు రవి
న్యూ ఢిల్లీ, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ఇన్నాళ్లు కుంభకర్ణుడిలా ఫాం హౌస్లో పడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. ఏడాది కాలంగా అసెంబ్లీకి ఎందుకు రాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలు పిట్టల దొర వ్యాఖ్యల మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల కోసం బీఆర్ఎస్ పోరాడటం లేదని, వారి అస్థిత్వం కోసమే పాకులాడుతున్నదని ఫైర్ అయ్యారు. కొడుకును, అల్లుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందుకే కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు.
లిక్కర్ స్కామ్ డైవర్షన్ కోసమే రేవంత్పై విమర్శలు: ఎంపీ చామల
బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత చేసిన లిక్కర్ దందాల నుంచి ప్రజల ఫోకస్ మారల్చేందుకే బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ దందాలు పక్కన పెట్టి నీచమైన రాజకీయాలు అంటూ కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.