బీజేపీ ఆఫీస్ ముట్టడించిన కాంగ్రెస్ : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్

బీజేపీ ఆఫీస్ ముట్టడించిన కాంగ్రెస్ : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్

నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు.. ఇటీవల రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని.. ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమన్నది. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ ను ముట్టడించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

దేశంలో ప్రజలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలపై ఇబ్బందులు పడుతున్నారని.. జనం సమస్యలు వదిలేసిన బీజేపీ పార్టీ, ప్రభుత్వం.. రాహుల్ గాంధీని టార్గెట్ చేయటం ఏంటని నిలదీశారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చామని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ఆఫీస్ ముట్టడించి నిరసనలు వ్యక్తం చేశారు. 

రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుందని.. అందులో భాగంగానే బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఏఐసీసీ పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. పోలీస్ కంప్లయింట్స్ ఇచ్చింది. ఢిల్లీలో బీజేపీ దిష్టిబొమ్మలు తగలబెట్టారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు.

కాంగ్రెస్ ముట్టడితో.. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులతో వాగ్వాదం జరిగింది. బీజేపీ ఆఫీస్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. బలవంతంగా అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.