
- కాంగ్రెస్ తరఫున నేడు సుప్రీంలో పిటిషన్
- ఎమ్మెల్సీ అమీర్అలీఖాన్
నిజామాబాద్, వెలుగు: సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన వక్ఫ్ బిల్లు రద్దయ్యేవరకు పోరాటం చేస్తామని సియాసత్ ఉర్దూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ సిటీలోని నిఖిల్సాయి హోటల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బిల్లును కేంద్రం నియంతృత్వ ధోరణితో రూపొందించిందన్నారు. ముస్లిం సమాజానికి బిల్లుపై పూర్తి అవగాహన కల్పించేందుకు అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్నామన్నారు.
తమ జాతిని చైతన్యం చేసి ఉద్యమిస్తామన్నారు. గతంలో ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలనూ ఏకపక్షంగా రూపొందించగా రైతులు ఉద్యమించి రద్దు చేసేదాకా వదలలేదన్నారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయబోతున్నామని చెప్పారు. 1964లో వక్ఫ్ చట్టాలు సవరణకు గురైనప్పుడు సుప్రీం కోర్టు అమలుపై స్టే ఇచ్చిందని ఇప్పుడూ కూడా అదే నమ్మకంతో వెళ్తున్నామని తెలిపారు. ఆయన వెంట సియాసత్ జిల్లా ప్రతినిధి జావీద్అలీ ఉన్నారు.