
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కింది. గవర్నన్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాల మధ్య మాటల తుటాలు పేలడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం చాట్ జీపీటీ ఏఐ వాడి తయారు చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని జగదీష్ రెడ్డికి స్పీకర్ సూచించారు. దీనికి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ సభ మనందరిది.. ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటది. అంతే తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు. మా అందరి తరుఫున పెద్దమనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు.. ఈ సభ మీ సొంతం కాదు’’ అని అన్నారు.
ALSO READ | సభా సమరం..అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఈ క్రమంలో స్పీకర్పై మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. దళిత స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించారని.. ఆయన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి అహంకారంతో మాట్లాడొద్దని.. క్షమాపణ చెప్పాల్సిందేనని శ్రీధర్ బాబు పట్టుబట్టారు. జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ను దూషించేలా మాట్లాడారని.. ఇందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు.
వెంటనే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సభ సంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఏం మాట్లాడానో చెప్పాలి.. స్పీకర్ ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధం కాదని అన్నారు. తాను స్పీకర్ అధికారుల గురించి మాట్లాడాలనుకున్నానని చెప్పారు. సభ సంప్రదాయాలు, స్పీకర్ అధికారాలు ఏంటో తేలాలని హాట్ కామెంట్స్ చేశారు. అన్నీ తేలాకే నేను మాట్లాడుతానని.. లేదంటే వెళ్లిపోతానని అన్నారు. జగదీష్ రెడ్డి కామెంట్స్ సభలో తీవ్ర దుమారం రేపడంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.