జస్ట్ మిస్: దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి కుట్ర

జస్ట్ మిస్: దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి కుట్ర

డెహ్రాడూన్: దేశంలో  రైలు ప్రమాదాలకు జరుగుతోన్న వరుస కుట్రలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‏లోని కాన్పూర్‎లో రైల్వే ట్రాక్‎పై గ్యాస్ సిలిండర్లు పెట్టి ట్రైన్ యాక్సిడెంట్‎కు ప్లాన్ చేయగా.. తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే.. రాజస్థాన్‌‎లోని అజ్మీర్‌లో రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను పెట్టి మరో భారీ విధ్వంసానికి తెరలేపారు. దాదాపు 70 కిలోల బరువున్న సిమెంట్ దిమ్మెను ట్రాక్‏పై అమర్చగా.. వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఈ దిమ్మెను ఢీకొట్టింది. 

ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతినగా.. పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగానే.. తాజాగా ఉత్తరఖాండ్‎లో మరో ట్రైన్ యాక్సిడెంట్‎కు భారీ కుట్ర జరిగింది. ఉత్తరఖాండ్‎లోని బిలాస్ పూర్-- రుద్రాపూర్ సిటీ మధ్య నడిచే గుజరాత్ మెయిల్ ఎక్స్‎ప్రెస్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్లాన్ చేశారు. ఈ మేరకు పట్టాలపై ఆరడగుల ఐరన్ రాడ్డును అడ్డుగా పెట్టారు. పట్టాలపై ఐరన్ రాడ్ గమనించిన లోక్ పైలట్ వెంటనే అప్రమత్తమై ట్రైన్‎ను ఆపేశాడు. 

వెంటనే రుద్రాపూర్ స్టేషన్ మాస్టర్‎తో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. పట్టాలపై ఐరన్ రాడ్డును తొలగించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లోక్ పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.