
హైదరాబాద్, వెలుగు: మణిపూర్లాగానే తెలంగాణనూ రావణకాష్టంలా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కుకీలలా ఇక్కడా పోరాటం చేయాలంటూ బీజేపీ ఎంపీ సోయం బాపురావు అనడం దారుణమన్నారు. గురువారం ఆయన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. రెండు తెగల మధ్య చిచ్చుపెట్టేలా బాపురావు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. సోయం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. సోయంపై రాష్ట్రపతికి, లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.