
ఎండలకు మాడిపోతున్న నేల మీద మొదటి చినుకు పడినప్పుడు వచ్చే వాసనను తలచుకుంటేనే భలే హాయిగా అనిపిస్తుంది కదా! ఆ అద్భుతమైన సువాసనను ఇండియాలో పర్ఫ్యూమ్ తయారుచేసేవాళ్లు ఒడిసి పట్టి అత్తర్గా బాటిల్లో నింపి ఇస్తున్నారు. ఈ అత్తర్ను ఎక్కడ తయారుచేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అనే వాటి వెనక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని కన్నోజ్ అనే టౌన్లో శతాబ్దాలుగా కొన్ని తరాలు మిట్టీ(మట్టి) అత్తర్ తయారుచేస్తున్నాయి. అందుకు మట్టితో తయారుచేసిన రకరకాల వస్తువులతో పాటు కుల్హడ్(మట్టితో తయారుచేసిన కప్పులు) కూడా వాడతారు. మిట్టీ అత్తర్ను తయారుచేసే మీనా పర్ఫ్యూమరీ కంపెనీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు రజత్ మెహరోత్రా. ఈ అత్తర్ తయారీ గురించి మాట్లాడుతూ ‘‘అన్నాదమ్ములం ఇద్దరం కలిసి ఈ కంపెనీ నడుపుతున్నాం. మాలాంటి కుటుంబాలు శతాబ్దాలుగా ఎనిగ్మాటిక్ ఫ్రాగ్రెన్స్ను సీసాల్లో పట్టి అందిస్తున్నాయి. మిట్టీ అత్తర్ మీకు మరెక్కడా దొరకదు” అని చెప్తూ అత్తర్ బాటిల్ నింపుతున్న రజత్ కళ్లు బాటిల్లో పడుతున్న మిట్టీ అత్తర్ మీదనే ఉన్నాయి. అంత జాగ్రత్త ఎందుకంటే మిట్టీ అత్తర్ ఒక్క చుక్క కూడా ఎంతో విలువైనది. 0.26 గ్యాలన్ల (దాదాపు 0.98 లీటర్లు)
మిట్టీ అత్తర్ ధర1,80,000 రూపాయలు.
అత్తర్ పుట్టింది ఎప్పుడు?
ఈ మిట్టీ అత్తర్ ఎలా పుట్టిందో తెలుసా? ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీలో ప్రత్యేకంగా అత్తర్ గురించి చదువుతున్న ఆంత్రోపాలజిస్ట్, బొటిక్ పర్ఫ్యూమ్ హౌస్ ఓనర్ గిటి దత్ ఆ విషయం గురించి చెప్తూ ‘‘మొదటిసారి అత్తర్లు ఎవరు తయారుచేశారనేది ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. అలాగే కన్నోజ్ మాత్రమే అత్తర్లకు కేంద్రంగా ఎలా మారింది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ అత్తర్ను డిస్టిలేషన్ చేయడం అనేది 3300 బీసీ నుంచి 1300బీసీ వరకు సింధునాగరికతలో ఉంది. అదే పద్ధతిని ఇప్పటికీ కన్నోజ్లో వాడుతున్నారు. ఎన్నో నాగరికతలు వచ్చిపోయినా, రాజులు రాజ్యాలు పోయినా ఈ పద్ధతి మాత్రం అలానే ఉండటం ఆశ్చర్యకరమైన విషయం.
బ్రిటిష్ వాళ్ల వల్ల19వ శతాబ్దంలో ఇండియాలో చాలా రకాల దేశీయ కళా రూపాలు అంతరించిపోయాయి. అందుకే అత్తర్ గురించిన సమాచారం అంతగా దొరకడం లేదు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. బ్రిటిషర్లు ఇండియాకు రాకముందు కన్నోజ్ పర్ఫ్యూమరీకి సంబంధించిన సమాచారం ఏదీ అందుబాటులో లేదు. కాకపోతే కన్నోజ్లో మెహరోత్రా ఫ్యామిలీ చేస్తున్న అత్తర్ బిజినెస్ని చూస్తే మాత్రం చాలా విషయాలు తెలుస్తాయి. అత్తర్ను బ్రిటిష్ వాళ్లు వర్తకపు సరుకుగా చేయాలనుకుని కన్నోజ్లో పర్ఫ్యూమ్ ఇండ్లను సెట్ చేసినట్టు తెలుస్తోంది? మసకబారిన మూలాలు, చరిత్ర గురించి కాసేపు పక్కన పెడితే... మిట్టీ అత్తర్ గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలియడం సంతోషించే విషయం” అని చెప్పింది.
అత్తర్ మీద పేపర్ ప్రజెంటేషన్ చేసిన హిస్టోరియన్ జ్యోతి మార్వా ఈ విషయం మీద మాట్లాడుతూ ‘‘పూర్వకాలంలో సింధు ప్రజలు సుగంధభరితమైన నీళ్లు, మొక్కల నుంచి తీసిన కషాయాలు వాడి రకరకాల సెంట్స్ తయారుచేశారు. వాటిని మెడిసిన్స్లో, దైవసంబంధిత కార్యక్రమాల్లో వాడేవాళ్లు. ఆ తరువాత వేద నాగరికతలో కూడా ఇలానే జరిగింది’’ అని అప్పటి విషయాలను గుర్తుచేసింది.
మట్టి వాసన కోసం...
మిట్టీ అత్తర్ను ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే రజత్ మెహరోత్రా ఫ్యాక్టరీ చూడాల్సిందే. అక్కడ అడుగపెట్టిన వాళ్లకు మొదట కనిపించేది ఇటుక బట్టీలో కాలిన మట్టి డిస్క్ల కుప్ప. వాటిని ఊళ్లో కుండలు అమ్మే వ్యక్తి దగ్గర తెస్తారు. వాటితో పాటు మట్టితో తయారుచేసిన వేరు వేరు మెటీరియల్స్ కూడా ఉన్నాయక్కడ. వాటిలో కుల్హడ్స్ కూడా ఉన్నాయి. కుల్హడ్స్ అంటే మట్టితో చేసిన టీ కప్పులు. ఆ మెటీరియల్ అంతా కలిపి దాదాపు 600 పౌండ్లు అంటే దాదాపు 272 కేజీలు ఉంటుంది.
ఒక పెద్ద రాగి పాత్రలో (డేగ్) వాటిని వేసి, అందులో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టారు. ఆ తరువాత చిన్న మూతితో, పొడవైన మెడ ఉన్న రాగి పాత్ర తీసుకున్నారు. ఆ పాత్రను భప్కా అంటారు. అందులో గంధం నూనె పోశారు. అన్ని రకాల అత్తర్లకు బేస్ ఇదే. భప్కాకి వంపు తిరిగిన వెదురు పైప్ ఒకటి ఉంది. అది మట్టి మెటీరియల్ నింపిన పాత్రకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక తడి ముల్తాని మట్టితో డిస్టిల్లర్ను సీల్చేశారు. దాంతో నేచురల్గా ఎయిర్ టైట్ కంటెయినర్ అయిపోయిందన్నట్టు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్!
అత్తర్ తయారుచేసేందుకు అవసరమైన వాటిని సమకూర్చుకున్నాక డిస్టిల్లర్ కింద చెక్క, ఆవు పిడకలు వేసి మంట పెట్టారు. ఆ మంట మరీ పెద్దదవకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకవేళ మంట ఎక్కువైతే డిస్టిల్లర్ నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అదే మంట తగ్గిపోతే ఆరిపోతుంది. అలా జరగకుండా ఆవు పిడకలు వేస్తుంటారు. అలా ఏడు గంటలు ఉంచాక ఆ రాగి పాత్ర కింద మంట తగ్గించారు. వేడెక్కిన డేగ్లో మట్టి ఉడికాక సుగంధపరిమళాలతో నిండిన ఆవిరి, వెదురు పైప్ ద్వారా చందనం నూనె నింపిన భప్కాలోకి చేరుతుంది. మట్టి సారాన్ని చందనం నూనె నెమ్మదిగా శోషించుకుంటుంది. ఆ తరువాత చందనం నూనె నుంచి నీళ్లను వేరుచేస్తుంది డిస్టిల్లర్. ఈ ప్రాసెస్ కనీసం పది రోజులు రిపీటెడ్గా జరుగుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే చిక్కగా ఉండే నూనె మాన్సూన్ షవర్స్ ఫ్రాగ్రెన్స్ను మోసుకొచ్చేవరకు అన్నమాట. ఒక్క రోజులో సువాసన తెలియదు. అందుకు నాలుగు నుంచి ఐదు రోజులు టైం పడుతుంది. పర్ఫ్యూమ్ తయారీ పూర్తయ్యాక ఒంటె చర్మంతో చేసిన ఫ్లాస్క్లో దాన్ని ఉంచుతారు. ఇలాచేయడంవల్ల పర్ఫ్యూమ్లో అదనంగా నీళ్లు ఉంటే ఆవిరైపోయి ఫ్రాగ్రెన్స్ ఒక్కటే మిగిలిపోతుంది. అత్తర్ ఎంత పాతది అయితే అంత బాగుంటుంది. ధర కూడా పలుకుతుంది.
పర్ఫ్యూమ్ రాజధాని నుంచి..
‘‘మిట్టీ అత్తర్ కొనేందుకు పర్ఫ్యూమ్ క్యాపిటల్ అయిన గ్రాస్ నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు. అలాగే న్యూఢిల్లీ, ముంబయి నుంచి కూడా. ‘‘ఫ్రాన్స్లోని గ్రాస్ నుంచి మా దగ్గరకు వచ్చి మిట్టీ అత్తర్ ఎలా తయారుచేస్తున్నామో చూస్తారు. వాళ్లు కూడా మిట్టీ అత్తర్ తయారీ ట్రై చేశారు. కానీ సరైన ఎసెన్స్ రాలేదు. చాలామంది కొత్త రకం కోసమని అత్తర్ తయారీలో సింథటిక్ మెటీరియల్స్ కలుపుతారు. అయితే ఎవరు, ఏ రకం పర్ఫ్యూమ్ తయారుచేసినా వాటికి బేస్ మాత్రం అత్తర్. అందుకని నేచురల్ పర్ఫ్యూమ్ ఆయిల్ కావాలనుకున్న వాళ్లు మా దగ్గరకు రండి. ఇంతకుముందు న్యూఢిల్లీలో ఉండే డిస్టిల్లర్లు పాన్లో వాడేందుకు సొంతంగా అత్తర్ తయారుచేసుకున్నారు.
కొన్నేండ్లకు పాన్ పాపులారిటీ తగ్గిపోయింది. దాంతో చాలామంది డిస్టిల్లర్లు ఆ బిజినెస్ మానేసి కొత్త బిజినెస్లోకి మారారు. ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు వచ్చినా అత్తర్ ప్రాభవం మాత్రం తగ్గలేదు. తగ్గదు కూడా. ఈ ఇండస్ట్రీ ఎవర్గ్రీన్. దీనికి చావు లేదు. కాకపోతే కాలానికి తగ్గట్టు మార్పులు వస్తుంటాయి. అందుకే కొత్తగా పర్ఫ్యూమ్ హౌస్లు రావడం ఆగలేదు. అంతేకాదు ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా నేచురల్ ఆయిల్స్ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడనే కాదు ఇంతకుముందు కూడా అత్తర్కు డిమాండ్ ఉంది. రసాయనాలతో నిండిన పర్ఫ్యూమ్స్ శరీరానికి మంచిది కాదు. అత్తర్ నేచురల్ ప్రొడక్ట్. దీన్ని తినొచ్చు కూడా’’ అంటున్నాడు రజత్ మెహరోత్రా.
అత్తర్ – ఇత్తర్
అత్తర్ను ఇత్తర్ అని కూడా పిలుస్తారు. సెంటెడ్ ఆయిల్స్ను సహజసిద్ధమైన పదార్ధాలతో తయారుచేస్తారు. అత్తర్లలో చాలా రకాలు ఉంటాయి. డమాస్క్ గులాబీ, మల్లె పువ్వుల నుంచి చేసిన అత్తర్లు గాఢంగా ఉంటాయి. మైల్డ్ స్మెల్ కోసం అయితే అగర్ ఉడ్ నుంచి తయారుచేస్తారు. మిట్టీ అంటే ‘భూమి’. వానలో తడిచిన నేల అందించే పరిమళాలను శతాబ్దాల నాటి పద్ధతి వాడి కన్నోజ్లో మాత్రమే తయారుచేస్తున్నారు.