ఇబ్రహీంపట్నం, వెలుగు: గత ప్రభుత్వ హయాం లో చేసిన పనులకు నేటికీ బిల్లులు రాలేదంటూ ఓ కాంట్రాక్టర్ తహసీల్దార్ ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపాడు. తనకు రావాల్సిన బిల్లులు చెల్లించే వరకు తీయబోనని తేల్చి చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీస్ శిథిలావస్థకు చేరడంతో దాని పక్కనే నిర్మించి వదిలేసిన జడ్పీ గెస్ట్ హౌస్ లోకి షిఫ్ట్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
పనులను పోల్కంపల్లికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ గండికోట దానయ్యకు అప్పగించారు. అగ్రిమెంట్ ప్రకారం రూ.50 లక్షల ఖర్చుతో పనులు పూర్తి చేశాడు. ఆ తర్వాత తహసీల్దార్ను అందులోకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అందులోనే కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో సోమవారం తహసీల్దార్ ఆఫీస్ గేటుకు తాళం వేసి కాంట్రాక్టర్ దానయ్య నిరసన తెలిపాడు.
బిల్లుల కోసం ఏండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నానని వాపోయాడు. బిల్డింగ్పనులు పూర్తిచేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సముదాయించడంతో నిరసన విరమించాడు. తనకు న్యాయం చేయాలని అధికారులను కాంట్రాక్టర్ కోరాడు.