
- కొన్నేండ్లుగా ఒకే సంస్థకు దక్కుతున్న కాంట్రాక్ట్
- జెన్కో లోతుగా దర్యాప్తు చేయాలని కాంట్రాక్టర్ల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: జెన్కో ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నడుస్తున్న భద్రాద్రి థర్మల్పవర్ప్లాంట్ (బీటీపీఎస్)లో కోల్ ఫిల్ చేసే జేసీబీల కాంట్రాక్ట్ గత కొన్నేండ్లుగా ఒకే సంస్థ దక్కించుకుంటున్నది. బీటీపీఎస్లోని కొందరు అధికారులు ఆ సంస్థకు అనుకూలంగా నిబంధనలను రూపొందిస్తుండడం వల్లే ఒకే సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు కొందరు పావులు కలుదుతున్నట్లు తెలుస్తున్నది.
మణుగూరు ప్లాంట్కు అవసరమైన బొగ్గును సింగరేణి సరఫరా చేస్తుంది. బొగ్గు లారీల ద్వారా బీటీపీఎస్కు వచ్చి కన్వేయర్ బెల్ట్వద్ద డంపింగ్జరుగుతుంది. కిందున్న బొగ్గును కన్వేయర్బెల్ట్పైకి వేసేందుకు జేసీబీలను వినియోగిస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ జేసీబీల టెండర్లను ఏండ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్ కి కట్టబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో అదే కాంట్రాక్టర్ కు మొదట టెండర్ దక్కినప్పుడు లేని నిబంధనలు తాజాగా చేర్చి సదరు సంస్థకే టెండర్ దక్కేలా కొందరు అధికారులు పావులు కదుపుతున్నట్లు ఇతర కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సదరు కాంట్రాక్టర్ కి సంబంధించిన పనుల్లో వేరే కాంట్రాక్టర్ టెండర్ వేసినందుకు ..సదరు వ్యక్తిపై దాడి చేసి టెండర్లలో పాల్గొనకుండా చేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అధికారుల అండదండలు ఉండడంతో జేసీబీలు పని చేసినా, చేయక పోయినా బిల్స్ క్లెయిమ్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ జేసీబీల వ్యవహారంపై జెన్కో అధికార యంత్రాంగం లోతుగా దర్యాప్తు చేయాలని బీటీపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.