
- పీసీబీ ఆఫీస్ ముందు ప్రజా సంఘాల ఐక్య వేదిక ధర్నా
రామచంద్రాపురం, వెలుగు: ప్యారానగర్ డంప్యార్డు ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక కన్వీనర్ రాజయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రామచంద్రాపురంలోని పీసీబీ ఆఫీసు ముందు ఐక్య వేదిక ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య సమస్య లేదని తప్పుడు ప్రచారం చేస్తూ డంపిండ్ యార్డుకు పర్మిషన్ ఇవ్వడం అర్ధరహితమన్నారు.
గ్రామ సభలు పెట్టకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా డంప్ యార్డు ఏర్పాటు ప్రక్రియను ఎలా ప్రారంభిస్తారని అధికారులను ప్రశ్నించారు. నల్లవల్లి ప్యారానగర్లో డంపింగ్ యార్డు పెడితే 15 కిలో మీటర్ల మేర జల, వాయు కాలుష్యం అవుతుందని, దీనివల్ల ప్యారానగర్ మరో జవహర్ నగర్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం కాదని తప్పుడు నివేదికలు ఇస్తున్న పీసీబీ అధికారులు వారం రోజులు జవహర్ నగర్ డంప్ యార్డు వద్ద ఉండి రావాలన్నారు.
నెల రోజులుగా డంప్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే డంప్యార్డు రద్దుకు పీసీబీ అధికారులు సిఫారసు చేయాలని లేని పక్షంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసును దిగ్భందం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నాగేశ్వర్రావు, రాంరెడ్డి, రాములు, వెంకటేశ్వర్ రావు, సురేశ్, రమణయ్య, వీరస్వామి, జయరాం, నరేందర్ పాల్గొన్నారు.