పని కావాలంటే పైసలియ్యాల్సిందే.. 14 నెలల్లో 14 మంది ఆఫీసర్లు ఏసీబీకి దొరికిన్రు

పని కావాలంటే పైసలియ్యాల్సిందే.. 14 నెలల్లో 14 మంది ఆఫీసర్లు ఏసీబీకి దొరికిన్రు
  • 14 నెలల్లో 14 మంది ఆఫీసర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన్రు
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరిస్థితి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఏదైనా పని కావాలంటే పైసలిచ్చుకోవాల్సిందే. అప్పటివరకూ టేబుల్​పై ఉన్న ఫైల్​డబ్బులివ్వగానే  ఆఫీసర్ల సంతకాల కోసం పరుగులు పెడ్తుంది. లంచం ఇస్తేనే పనైతదనే పరిస్థితి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నెలకొంది. రెవెన్యూ, పోలీస్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, మెడికల్​కాలేజీ.. ఇలా ఏ శాఖలోనైనా లంచాలు లేనిదే పని కావడం లేదని ప్రజలు అంటున్నారు.

కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది లంచాలకు కక్కుర్తి పడుతూ ఆయా శాఖలకు చెడ్డ పేరు తెస్తున్నారని నిజాయితీగా పని చేస్తున్న ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 14 నెలల కాలంలో వివిధ శాఖలకు చెందిన14 ఆఫీసర్లు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.  ఓవైపు లంచాలు తీసుకుంటూ ఆఫీసర్లు ఏసీబీకి దొరుకుతున్నా అవినీతి ఆగకపోవడం గమనార్హం. అవినీతి అధికారులు, సిబ్బంది చాలామంది ఉన్నారని, ఏసీబీ దాడులు ఇంకా పెరగాలని ప్రజలు కోరుతున్నారు. ​ 

ఇప్పటివరకు పట్టుబడినవారి వివరాలు..
    

  • భద్రాచలంలో సీఐ బి.రమేశ్, గన్​మెన్​ రామారావు ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు.    
  • పాల్వంచ మున్సిపాలిటీలో సూపరింటెండెంట్ అక్కిరెడ్డి వెంకటరమణారెడ్డి, ప్రసన్నకుమార్ రూ.15 వేలు తీసుకుంటూ చిక్కారు.     
  • భద్రాచలం టౌన్​ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్​శంకర్​ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ దొరికారు.    
  • అశ్వారావుపేటలో విద్యుత్​ శాఖ అసిస్టెంట్​ఇంజినీర్​ధారావత్​శంకర్ రూ.లక్ష తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.     
  • చర్ల తహసీల్దార్​ ఆఫీస్​లో డిప్యూటీ తహసీల్దార్ భరణి బాబు రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.   
  • పాల్వంచ టౌన్​ఎస్ఐ బాణాల రాము రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.     
  • కొత్తగూడెంలోని ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ లో హార్టికల్చర్​ఆఫీసర్​ కె. సూర్యనారాయణ రూ. 1.14 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు.    
  • పాల్వంచలో విద్యుత్​శాఖలో లైన్​ఇన్​స్పెక్టర్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటూ దొరికారు.     
  • పాల్వంచ మెడికల్​ కాలేజీ ఏవో ఖలీల్​తోపాటు మరో ఉద్యోగి రూ.3 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.     
  • లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ పుల్లయ్య రూ.18 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.     
  • దమ్మపేట మండలంలో పని చేస్తున్న సర్వేయర్ మెరుగు రత్నం భూమి సర్వే రిపోర్ట్​ఇచ్చేందుకు  రూ.2 లక్షలు అడిగి, రూ. 50 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.     
  • ఇల్లెందు ఫారెస్ట్​ రేంజ్​ఆఫీస్​లో పని చేస్తున్న రేంజర్​ఉదయ్​కుమార్​, బీట్​ ఆఫీసర్​ హరిలాల్​రూ.30 వేలు తీసుకుంటుండడగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.    
  • అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి సాయి శంతన్​ఓ రైతు వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.   
  • కొత్తగూడెం పట్టణంలోని కూలీ లైన్ గవర్నమెంట్​ హైస్కూల్​హెచ్ఎం రవీందర్​రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. 

గుబులు పుట్టిస్తున్న ఏసీబీ డీఎస్పీ 

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. లంచాలు తీసుకునే వారికి ఏసీబీ డీఎస్పీ రమేశ్​గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస ఏసీబీ దాడులతో అవినీతి అధికారులు, సిబ్బంది వివరాలు చెప్పేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. లంచం అడిగితే భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచుతామని డీఎస్పీ సూచిస్తున్నారు.