ఫిబ్రవరి 13 నుంచి జేఎల్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ 

ఫిబ్రవరి 13 నుంచి జేఎల్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ 

హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్​ను ఇంటర్మీడియెట్ ఆర్జేడీ జయప్రద బాయి రిలీజ్ చేశారు. ఈ నెల 19 వరకూ ఈ ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. మొత్తంగా 1286 మందిని కౌన్సెలింగ్​కు పిలవగా, దాంట్లో మల్టీజోన్ 1 పరిధిలో 659 మంది, మల్టీజోన్ 2 పరిధిలో 627 మంది పాల్గొననున్నారు.

వీరికి హైదరాబాద్​లోని గన్ ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మల్టీజోన్1 అభ్యర్థులకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మల్టీజోన్ 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. 13న 214 మందికి,14న 215 మందికి, 15న 215 మందికి, 17న 214 మందికి, 18న 213 మందికి,19న 215 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా, ఇప్పటికే వీరికి సబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కావడంతో, సబ్జెక్టుల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి, కాలేజీలను అలాట్ చేయనున్నారు.