
- కస్టమర్ కు మెంబర్ షిప్ డబ్బు రూ. 1.65 లక్షలు వడ్డీతో సహా తిరిగివ్వండి
- కంట్రీ క్లబ్ కి కన్జ్యూమర్ ఫోరమ్ ఆదేశం...
హైదరాబాద్ సిటీ, వెలుగు:ఫారిన్ టూర్ ప్యాకేజీలు, ఫ్రీ ప్లాట్, 20–30 శాతం డిస్కౌంట్ లు ఫేక్ హామీలతో మోసం చేస్తున్న బేగంపేటలోని కంట్రీ క్లబ్ కంపెనీకి స్టేట్ కన్జ్యూమర్ ఫోరం జరిమానా విధించింది. కస్టమర్ ను మోసం చేసిన కేసులో బాధితుడికి మెంబర్ షిప్ డబ్బులు రూ.1.65లక్షలు 12 శాతం వడ్డీ, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.25వేలు, ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్ బేగంపేట చెందిన కంట్రీ క్లబ్ ను ఆదేశించింది.
బోడుప్పల్ కు చెందిన కిశో ర్ కుమార్ భార్య డిన్నర్ సెట్ గెల్చుకున్నారని, బేగంపేట్ లోని తమ ఆఫీసులో జరిగే మీటింగ్ కు భార్యాభర్తలిద్దరూ అటెండ్ కావాలని కంట్రీ క్లబ్ కాల్ చేసి కోరగా దంపతులు హాజరయ్యారు. 7 డేస్, 6 నైట్స్ బ్యాంకాక్ టూర్, ట్రెయిన్, ఫ్లైట్, బ్యూటీ పార్లర్, స్పా, స్విమ్మింగ్ ఫూల్లో 20–-30 శాతం డిస్కౌంట్ కి సంబంధించిన కార్డ్ ఇస్తామని ఆశ చూపారు. వరంగల్ దగ్గర 150 గజాల వ్యవసాయ భూమిని గిఫ్ట్ గా ఇస్తామంటూ నమ్మించారు.
డబ్బులు తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో
రూ.1.65 లక్షలతో కంపెనీలో సభ్యత్వం కోసం డబ్బు కట్టారు. ఒప్పందం ప్రకారం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. గిఫ్ట్ గా ఇస్తున్న భూమిని కూడా చూపించలేదు, డబ్బు తిరిగి ఇవ్వాలని పలు మార్లు ఫోన్లు చేసినా ఫలితం లేకపొయే సరికి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ను సంప్రదించగా డబ్బును తిరిగివ్వాలని ఆదేశించింది.
దాంతో కంట్రీ క్లబ్ వారు స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్ లో అప్పీల్ వేయగా మోసపూరిత హామీలతో ప్రజలను నష్టపరుస్తున్నందు వల్ల కంపెనీకి మొట్టికాయలు వేసింది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్ తీర్పును సమర్థిస్తూ డబ్బును తిరిగివ్వాలని, కోర్టు సమయం వృథా చేసినందుకుగాను రూ.10వేలు కోర్టుకు జరిమానా కట్టాలని కంట్రీ క్లబ్ ను ఆదేశించింది.