
ఘట్కేసర్, వెలుగు: కరిగిన ఐస్ క్రీమ్ ఇచ్చారని ఓ షాపు ఓనర్తో పాటు అతని భార్యపై ఇద్దరు నిందితులు దాడి చేశారు. సీఐ పరుశురామ్ తెలిపిన ప్రకారం.. రాజస్థాన్కు చెందిన పప్పు రామ్, శైలు కుమావత్ దంపతులు తమ పిల్లలతో కలిసి ఘట్కేసర్ మున్సిపాలిటీ అంకుషాపూర్ లో ఉంటూ కిరాణ షాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానికుడు మచ్చ రాజశేఖర్ వీరి షాప్ కు వెళ్లి, రూ.20తో రెండు ఐస్క్రీమ్ కొనుగోలు చేశాడు. గంట తర్వాత మళ్లీ వెళ్లి ఐస్క్రీమ్లు కరిగిపోయాయని, క్వాలిటీ లేనివి ఇచ్చారని వాగ్వాదానికి దిగాడు.
తిరిగి సాయంత్రం తన సోదరుడు విశాల్తో కలిసి మళ్లీ షాప్ కు వెళ్లి పప్పు రామ్, అతని భార్య శైలుపై దాడి చేసి అసభ్యకరంగా దూషించారు. ఈ దాడిలో పప్పు రామ్ పాపకు కూడా గాయాలు కాగా, షాపులోని సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.