
హనుమకొండ/ జనగామ అర్బన్/ ఏటూరునాగారం/ ఎల్కతుర్తి/ వర్ధన్నపేట, వెలుగు: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా, జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ హెచ్చరించారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ స్టేషన్ పరిధిలోని అంబాల, నేరెళ్లవాగును సీఐ హరికృష్ణతో కలిసి సీపీ పరిశీలించారు. జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వే బ్రిడ్జిని సీఐ అనుములు శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్తో కలిసి ఏఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్కడైనా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇదిలాఉండగా ఎల్కతుర్తి మండల పరిధిలో మానేరు వాగు నుంచి బావుపేటకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను, వర్ధన్నపేట మండలం రాందాన్ తండా శివారులో ఏడు ట్రాక్టర్లలో ఇసుక నింపుతుండగా పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు.