
ఖమ్మం టౌన్, వెలుగు : సెక్టార్ ఆఫీసర్లకు అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సెక్టార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సెక్టార్ ఇన్చార్జి పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సెక్టార్ పోలీసింగ్ ద్వారా నేరాలు అడ్డుకోవడంతో పాటు ఎప్పుడు, ఏ క్షణమైనా తామున్నామని ప్రజల్లో భరోసా కల్పించాలన్నారు. గ్రామాల్లో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగంతో వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్ కార్యకలాపాలపై పూర్తిగా నిఘాను పెంచాలని ఆదేశించారు. విజబుల్ పోలీసింగ్, పోలీస్ పెట్రోలింగ్ మరింత పకడ్బందీగా అమలు చేయడం ద్వారా నేరాలు నియంత్రణలో ఉంటాయన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ స్వామి పాల్గొన్నారు.