జలవిహార్ ఆక్రమణలపై చర్యలు తీసుకోండి : సీపీఐ

జలవిహార్ ఆక్రమణలపై చర్యలు తీసుకోండి : సీపీఐ
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్​కు సీపీఐ ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హుస్సేన్ సాగర్ ను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన జలవిహార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా  హైడ్రాను కోరారు. ఈ మేరకు బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సాగర్ ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జలవిహార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పర్యావరణానికి ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జలవిహార్ నిర్వాహకులు చేపట్టిన ఆక్రమణలకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేశారు. కమిషనర్ ను కలిసిన వారిలో సీపీఐ తెలంగాణ అసిస్టెంట్ సెక్రటరీ బాలా మల్లేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్టు సీపీఐ నాయకులు తెలిపారు.