
- మనతో ట్రంప్ నిరంకుశంగా ఉంటున్నరు: నారాయణ
హైదరాబాద్, వెలుగు: మన దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరకుంశంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ట్రంప్ విధానాలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించాలని, అమెరికాతో మైత్రీ బంధాన్ని వీడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ట్రంప్ యత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే వివిధ దేశాలపై ఆంక్షలు విధిస్తూ అక్కడి ప్రభుత్వాలను కూలగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోని సీపీఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ప్రపంచ దేశాలకు ట్రంప్ ప్రమాదకరంగా మారుతున్నారని వ్యాఖ్యానించారు.
అక్రమ వలసదారులను తమ దేశం నుంచి వెనక్కి పంపుతున్నామంటూ వారితో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.