అదే జరిగితే భారత్‏లో ప్రజాస్వామ్యం ఉండదు: CPI నారాయణ

అదే జరిగితే భారత్‏లో ప్రజాస్వామ్యం ఉండదు: CPI నారాయణ

హైదరాబాద్: హైడ్రా చాలా హడావుడి చేస్తోందని.. మూసీ నిర్వాసితులను కొత్త ఇండ్లలోకి షిఫ్ట్​చేసిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. వన్‌ నేషన్ పేరుతో హక్కులను కాలరాస్తూ ఆర్డినెన్సులు తీసుకొచ్చే ఆలోచనలను కేంద్రం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదే జరిగితే ప్రజాస్వామ్యం ఉండదని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని వార్నింగ్ ఇచ్చారు. 

హైదరాబాద్​లోని సీపీఐ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ‘చెరువులు, కుంటలు ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. 
కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అక్రమ నిర్మాణాలు కూల్చితే పెద్దగా సమస్యే లేదు. మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కొంతమంది అడ్డు పడుతారు.. సమస్య ఉంది కాబట్టి వ్యతిరేకిస్తరు. పేదలకు ప్రత్యామ్నాయాలు చూపకుండా కూల్చోద్దు. దేశంలో మౌలిక సదుపాయాల కొసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. 

ALSO READ | మూసీలో బడా నేతల ఇళ్లే ఎక్కువ..పేదలకు న్యాయం చేస్తాం

ఎక్స్‌ప్రెస్ హైవేలో సైడ్స్‌లో చాలా హైట్‌లో గోడలు కడుతున్నరు. రైతుల భూములు చుట్టూ ఉంటాయి.. వారు ఎక్కడ నుంచి నడవాలి? తాత్కాలిక ఉపశమనం కోసం అక్కడక్కడ గ్యాప్ ఇస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఎక్స్ ప్రెస్ వేలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. సర్వీస్ రోడ్‌ ఉండాల్సిందే. అభివృద్ధి జరగాలి.. అంటే.. అదాని అభివృద్ధి కాదు. అందుకే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి లేఖ రాశాం. రైతులకు అన్యాయం చేస్తే మా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతం’ అని నారాయణ హెచ్చరించారు.