
దేవరకొండ, వెలుగు: సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో లక్షల కోట్ల రియల్ వ్యాపారానికి తెర లేపారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వత్రెడ్డి 25వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. దైవ భక్తితో విగ్రహం ఏర్పాటు చేయలేదని, రియల్ వ్యాపారాన్ని పెంచుకోడానికే ఏర్పాటు చేశారని ఆరోపించారు. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప పోరాటయోధుడు పల్లా పర్వత్రెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.