
హుస్నాబాద్, వెలుగు : చట్ట సభలు కోటీశ్వరుల నిలయాలుగా మారాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల చేతిలో పెట్టి పెద్దోళ్లకే ఉపయోగపడేలా చేశారన్నారు. డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి దాపురించిందన్నారు. అందుకే వామపక్షాలు ఆటుపోట్లకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవకులెవరో, దోపిడీదారులెవరో ప్రజలు గుర్తించపోతే ప్రజాస్వామ్యం నిలవబోదని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి పేదలందరికి గృహలక్ష్మి, బీసీ బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, సహాయ కార్యదర్శులు బొజ్జపురి రాజు, మారుపాక అనిల్, చిట్టాల కొమురయ్య, గాంభీరపు మధుసూదన్, సంతోశ్పాల్గొన్నారు.