
- బుకీల అవతారమెత్తి జనాలను ముంచుతున్న కేటుగాళ్లు
- ఆస్తులు పోగొట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు
- అరెస్టులతో చేతులు దులిపేసుకుంటున్న పోలీసులు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరం క్రికెట్ బెట్టింగ్ దందాకు అడ్డాగా మారుతోంది. ఏటా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే గ్రేటర్ సిటీకి చెందిన కొందరు బుకీల అవతారమెత్తి బెట్టింగ్ నిర్వహిస్తుండగా, వారి వలలో పడి ఎంతోమంది యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడుతుంటే, ఇంకొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి బుకీల దందాకు చెక్ పెట్టాల్సిన పోలీసులు అరెస్టులతో చేతులు దులిపేసుకుంటుండగా, జైలుకు వెళ్లొచ్చిన బెట్టింగ్ రాయుళ్లు ఏటా అదే దందా సాగిస్తున్నారు.
ఇలా తరచూ బెట్టింగ్లు నిర్వహించేవారిపై పీడీ యాక్టులు పెట్టాల్సిన పోలీసులు లైట్తీసుకుంటుండడంతో నగరంలో బెట్టింగ్ దందాకు ఫుల్స్టాప్ పడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం కాక రేపుతుండగా, సిటీలోని క్రికెట్ బుకీలపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఏటా రూ.కోట్లతో దందా..
వరంగల్ నగరంలో ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే బెట్టింగులపైనే ఆధారపడుతున్నారు. ప్లే స్టోర్లలో లభించే యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని బెట్టింగులు కాస్తున్నారు. ఇలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వారిని లోకల్ గా బుకీలుగా మారిన వ్యక్తులు లీడ్ చేస్తున్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వారికి ప్రత్యేకంగా యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇచ్చి లాగిన్ చేయించుకుని, ప్రతి మ్యాచ్ స్టార్టింగ్కు ముందు ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్ బెట్టింగ్పెడుతున్నారు. తక్కువ మొత్తంలో బెట్పెట్టినప్పుడు గెలిపించి, ఎక్కువ మొత్తంలో పెట్టినప్పుడు ఓడగొడుతూ గోల్మాల్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఐపీఎల్ సీజన్లో రూ.కోట్లలో దందా సాగిస్తుండగా, వారి బారిన పడి ఎంతో మంది నష్టపోతున్నారు.
రోడ్డున పడుతున్న కుటుంబాలు..
బెట్టింగ్ బాగోతం వల్ల కొంతమంది అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొంతమంది అప్పులు తీర్చేందుకు చోరీల బాట పడుతున్నారు. మూడేండ్ల కిందట ధర్మసాగర్ మండలం మల్లక్పెల్లికి చెందిన రామకృష్ణారెడ్డి బెట్టింగుల్లో రూ.6లక్షల వరకు లాస్ అయి ప్రాణాలు తీసుకున్నాడు. 2023 నవంబర్లో నర్సంపేటకు చెందిన ప్రశాంత్ రూ.2 లక్షల అప్పులు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జులైలో రఘునాథపల్లికి చెందిన రైల్వే ఉద్యోగి రాజు కూడా ఇలాగే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఇలా కొంతమంది అప్పుల భారంతో సూసైడ్ చేసుకుంటుంటే, మరికొందరు దొంగలుగా మారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. రాయపర్తికి చెందిన ధర్మరాజు క్రికెట్ బెట్టింగ్లో లాస్ అయి 17 చోరీలు చేయగా, పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దాదాపు రెండేండ్ల కిందట వరంగల్ సిటీ బొక్కలగడ్డ, కాకతీయ కాలనీకి చెందిన ఏడుగురు యువకులు బెట్టింగుల్లో లాస్అయి దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సునీల్ కూడా ఇలాగే చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
రెండు రాష్ట్రాల బుకీ.., ఐదుసార్లు అరెస్ట్
హనుమకొండ గోపాలపూర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ 2016 నుంచి బెట్టింగ్ మొదలుపెట్టాడు. ముంబైకి చెందిన కొంతమందిని పరిచయం చేసుకుని రెండు రాష్ట్రాల బుకీగా మారాడు. 2019లో మొదటిసారి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చందానగర్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ అదే దందా చేస్తూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రామచంద్రాపూర్ పోలీసులకు చిక్కాడు. అనంతరం వరంగల్ కు మకాం మార్చి ఐపీఎల్ సీజన్లో కోట్లలో లావాదేవీలు నడిపిస్తుండగా, ఆయన చేతుల్లో మోసపోయిన ముగ్గురు బాధితులు కేయూ, హనుమకొండ పీఎస్లలో ఫిర్యాదు చేశారు. 2021 నవంబర్లో వరంగల్ టాస్క్ ఫోర్స్పోలీసులు పట్టుకున్నారు.
ఆ సమయంలో ప్రసాద్వద్ద రూ.2.05 కోట్ల నగదు, బ్యాంక్అకౌంట్లో మరో రూ.70 లక్షలు లభ్యం కావడంతో అతడి దందా ఏపాటిదో పోలీసులకు కూడా అర్థమైంది. ఆ తర్వాత జైలుకు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ అదే బాటలో నడిచాడు. 2022 జూన్లో రూ.20 లక్షలతో, 2024 ఆగస్టులో మళ్లీ రూ.32 లక్షలతో కేయూ పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో ఐదు సార్లకుపైగా పోలీసులకు చిక్కగా, మరికొంతమంది కూడా ఇలాగే దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏటా బెట్టింగ్లు నిర్వహిస్తున్నా పీడీ యాక్టుల్లాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే వారి దందా మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా కొనసాగుతోందనే టాక్ నడుస్తోంది.
ఎన్నిసార్లు చిక్కినా నో ఛేంజ్..
బెట్టింగ్ కు అలవాటుపడిన కొంతమంది ఆ దందాను విడిచిపెట్టడం లేదు. ఏటా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే బెట్టింగులకు రెడీ అయిపోతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా జైలుకు వెళ్లి బయటకు రావడం, మళ్లీ అదే దందా చేయడం కామనైపోయింది. కమిషనరేట్లో గతంలో వివిధ క్రికెట్ టోర్నీల్లో బుకీలుగా వ్యవహరించిన కొంతమంది మళ్లీ అదే దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఏదైనా కేసులో రెండు, మూడుసార్లు పట్టుబడితే పీడీ యాక్టులు పెడుతామని చెప్పే పోలీసులు, దానిని మాటలకే పరిమితం చేస్తుండటం వల్లే బెట్టింగ్ రాయుళ్లు, బుకీలకు చెక్ పడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఇలాంటి బెట్టింగ్బుకీల ఆగడాలకు చెక్పెట్టి, అమాయకుల జీవితాలు రోడ్డున పడకుండా చూడాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.