
- గోవా, ముంబైలో మెయిన్ బుకీలు.. సిటీలో సబ్ బుకీలు, పంటర్లు
- ప్రతి మ్యాచ్కు కోడ్, ఐడీ, పాస్వర్డ్ తో బెట్టింగ్ ఎంట్రీ
- హవాలా, క్రిప్టో రూపంలో దేశం దాటుతున్న బెట్టింగ్ సొమ్ము
- 108 బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ టార్గెట్గా హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ దందా మళ్లీ షురూ అయ్యింది. సిటీలోని దాదాపు18 బెట్టింగ్ ముఠాలు ఈ ఆన్లైన్లో దందా నడుపుతున్నాయి. ఐపీఎల్ సెషన్ ముగిసేలోగా వేల కోట్ల రూపాయలు దండుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన నిర్వాహకులు, పంటర్ల(బెట్టింగ్ కాసేవారు)పై పోలీసులు నిఘా పెట్టారు. డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ బెట్టింగ్ ముఠాల పనిపడుతున్నారు. జూబ్లీహిల్స్, మధురానగర్లో ఇటీవల సోదాలు నిర్వహించిన పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే 108 బెట్టింగ్ వెబ్ సైట్లు బ్లాక్ చేసి.. 133 బెట్టింగ్ యాప్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
బెట్టింగ్కు కేరాఫ్గా సోషల్ మీడియా యాప్స్
గతంలో దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లు వరల్డ్ కప్ మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్ మాఫియా.. ఇప్పుడు ఐపీఎల్, 20–20 మ్యాచ్లకు పాకింది. సోషల్మీడియా యాప్స్, డిజిటల్ పేమెంట్లను బెట్టింగ్ మాఫియా తమకు అనుకూలంగా మలచుకుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో లింకులు షేర్ చేస్తున్నది. ఒకరితో ఒకరు కలిసే అవకాశం లేకుండా ఆన్ లైన్లోనే బెట్టింగ్, మనీ ట్రాన్స్ఫర్లు జరిగిపోతున్నాయి.
టీమ్ కూర్పు నుంచి ప్రతి బాల్ వరకు..
టీమ్స్ కూర్పు, టాస్ దగ్గర్నుంచి ప్రతి బాల్, రన్, ఫోర్, సిక్స్, వికెట్ సహా మ్యాచ్ గెలుపు, ఓటములపై బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా నాలుగు లేయర్లుగా పనిచేస్తున్నది. ఢిల్లీ, ముంబై, బెంగళూర్ సహా దేశంలో మెట్రోసిటీలోని మెయిన్ బుకీల ఆదేశాలతో దేశవ్యాప్తంగా సబ్ బుకీలు, ఏజెంట్ల నెట్వర్క్లో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతున్నది. మ్యాచ్కు నిమిషాల ముందే బెట్టింగ్ పాస్వర్డ్స్, ఐడీలతో బెట్టింగ్ మాఫియా పోలీసుల కళ్లుగప్పి ఆన్లైన్లో అందినకాడికి పిండుకుంటున్నది. ఇందుకోసం సోషల్ మీడియాలో కోడ్ భాషలో బెట్టింగ్ లింకులు సర్క్యులేట్ చేస్తున్నారు. మనీ ట్రాన్స్ఫర్ కోసం ఫేక్ అకౌంట్లు సేకరిస్తున్నారు. ఇలా ప్రతీ మ్యాచ్కు కోట్ల రూపాయల బెట్టింగులతో హవాల డబ్బు చేతులు మారుతున్నది.
బుకీలుగా మారుతున్న పంటర్లు
బెట్టింగ్ మాఫియా వలలో చిక్కిన పంటర్లు , ఏజెంట్లు చైన్ సిస్టమ్తో బెట్టింగ్ దందా సాగుతున్నది. బుకీలు అంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మ్యాచ్ను టార్గెట్ చేసి బెట్టింగ్లు నిర్వహిస్తూ.. పంటర్లను బుకీలు తమ ఏజెంట్లుగా మార్చుతున్నారు. పంటర్లుగా బెట్టింగ్లో తనకున్న అనుభవంతో సబ్ బుకీలుగా ఆ తరువాత మెయిన్ బుకీగా అవతారమెత్తుతున్నరు. ఫ్రెండ్స్తో పాటు క్రికెట్ అభిమానులను ట్రాప్ చేసి బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు. ఇలా ఒక్కో బుకీ సుమారుగా 200 మందికి పైగా ఏజెంట్లతో బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బెట్టింగ్ డబ్బు హవాలా, క్రిప్టో రూపంలో దేశాలు దాటుతున్నది. ఇలా బుకీల నెట్ వర్క్లో పనిచేసే పంటర్లు, ఏజెంట్లకు మ్యాచ్ను బట్టి కమీషన్లు చెల్లిస్తుంటారు.
ఐదుగురి అరెస్టు
కుమ్రంభీమ్ జిల్లా కాగజ్నగర్కు చెందిన ఐదుగురు యువకులు క్రికెట్ బెట్టింగ్లు పెట్టేవారు. క్రమంగా బెట్టింగ్ ఎలా నిర్వహిస్తారో తెలుసుకున్నారు. హైదరాబాద్ మధురానగర్లో ఓ ఇంటిని రెంటుకు తీసుకుని ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కళ్యాణి, శ్రీదేవి, మిలన్ పేరుతో సట్ట, మట్కా ఆన్లైన్ బెట్టింగ్ ఆపరేట్ చేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ల నేపథ్యంలో సిటీ టాస్క్ఫోర్స్లు స్పెషల్ ఆపరేషన్లు చేస్తున్నారు. కొద్దిరోజుల కింద మధురానగర్లో బెట్టింగ్ సమాచారం అందుకున్న పోలీసులు రెయిడ్స్ చేసి నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.
యాప్స్ డెవలపర్లు, నిర్వాహకులను గుర్తించాం
బెట్టింగ్ మాయలోపడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంజాగుట్టలో నమోదైన యూట్యూబర్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో కీలక ఆధారాలు సేకరించాం. ఈ యాప్స్ డెవలపర్లు, నిర్వాహకులను గుర్తించాము. దీంతో పాటు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పై పటిష్ట నిఘా పెట్టాము. బెట్టింగుల గురించి తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి.
- విజయ్కుమార్,
డీసీపీ, వెస్ట్జోన్, హైదరాబాద్