
కోల్ బెల్ట్/ బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ– 2 గ్రౌండ్లో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి స్మారక నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రోజు పోటీలను మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి ప్రారంభించారు. మొదటి మ్యాచ్లో కాసీపేట–తాండూర్ మండల జట్లు తలపడ్డాయి.
15 ఓవర్లలో తాండూర్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 101 రన్స్ చేసింది. నరేశ్ గబ్బార్ 40, రమేశ్ 22 రన్స్ చేశారు. కాసీపేట జట్టుకు చెందిన సంతోశ్ 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన కాసీపేట జట్టు 10.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. తిరుపతి 23, అశోక్ 20 పరుగులు చేశారు. బౌలర్ సంతోశ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
రెండో మ్యాచ్లో..
సోమవారం మధ్యాహ్నం బెల్లంపల్లి–భీమిని మండ లాల జట్ల మధ్య పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భీమిని జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 79 రన్స్ చేసింది. నవీన్ 13 పరుగులు చేశాడు. బెల్లంపల్లి జట్టుకు చెందిన బౌలర్ సాయి రాం 8 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన బెల్లంపల్లి మండల జట్టు 8.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 83 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టుకు చెందిన సాయికృష్ణ 29 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో 53 పరుగులు చేశాడు. జట్టుకు చెందిన సాయిరాం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.